1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (20:33 IST)

నలుపూ లేదు.. పసుపూ లేదు... ఎలాంటి ఫంగస్‌లు లేవు : ఎయిమ్స్

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే, మరోవైపు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లంటూ ప్రజలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా, బ్లాంక్ ఫంగస్ సోకి అనేక మంది చనిపోయారనే వార్తలు వింటున్నాం. ఇపుడు తాజాగా ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్‌లు తెరపైకి వచ్చాయి. కరోనా రోగుల్లో ప్రాణాంతకంగా మారుతున్న ఫంగస్‌లకు రంగులు ఆపాదించడంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. 
 
ఫంగస్‌లను రంగుల పేర్లతో పిలవడం ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారని, ఒకరకంగా ఇది తప్పుదారి పట్టించడమేనని అభిప్రాయపడ్డారు. ఫంగస్ ఒక్కోప్రాంతంలో ఒక్కో రంగులో కనిపిస్తుందని, అక్కడి పరిస్థితులు దాని రంగును ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఫంగల్ ఇన్ఫెక్షన్  సాంక్రమిక వ్యాధి కాదని అన్నారు. 
 
నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలుగా ఉంటాయన్నారు. అవి, మొదటి రకం.. మ్యూకార్ మైకాసిస్ కాగా, రెండోది కాండిడా, మూడోది ఆస్పర్ జిల్లోసిస్ అని వివరించారు. వీటిలో మ్యూకార్ మైకాసిస్ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారని, ఆస్పర్ జిల్లోసిస్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు.
 
ఇక, కరోనా మూడో వేవ్ తథ్యమని, మూడో వేవ్‌లో పిల్లల పాలిట కరోనా ప్రమాదకరంగా మారుతుందన్న ప్రచారంపైనా గులేరియా స్పందించారు. ఈ ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. పీడియాట్రిక్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ఏమంత ప్రభావం చూపబోదని, దీనిపై ఆందోళన చెందాల్సిన గులేరియా వివరించారు.