1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (13:44 IST)

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్‌ విరామంపై నీతి ఆయోగ్ క్లారిటీ..

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్‌ విరామంపై నీతి ఆయోగ్ క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే విరామ కాలాన్ని తగ్గించారంటూ వచ్చిన వార్తలపై ఆందోళన అనవసరమని కేంద్రం పేర్కొంది. ఈ విరామాన్ని శాస్త్రీయ అధ్యయనం ప్రకారమే తగ్గించడం జరిగిందని, అయితే ప్రజలు దీనిపై అయోమయానికి గానీ, కలవరానికి గానీ గురి కారాదని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డా.వీ.కె.పాల్ అన్నారు. 
 
ఒక్కోసారి రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని బ్యాల్సన్స్ (తులనాత్మకం) చేయాల్సి ఉంటుందని, దీన్ని గోరంతలు కొండంతలు చేయరాదని పాల్ విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాలన్నీ జాగ్రత్తగా తీసుకున్నవేనని, గ్యాప్ పెంచినప్పుడు మొదటి డోసు తీసుకున్నవారికి వైరస్ వల్ల కలిగే రిస్క్‌ను పరిశీలించడం జరిగిందన్నారు. ఇలా వీరిలో కూడా రోగ నిరోధక శక్తి పెరగవలసి ఉందన్నారు. అంతే తప్ప ఇందులో సందిగ్ధతకు తావు లేదన్నారు. 
 
శాస్త్రీయ స్టడీని పురస్కరించుకునే కోవిషీల్డ్ వ్యాక్సిన్ గ్యాప్‌పై మార్పునకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని పాల్ వివరించారు. నిపుణులే ఈ సూచనలు చేశారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొంతమంది రీసెర్చర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు.