శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (19:17 IST)

మామను భుజాలపై మోసుకెళ్లిన కోడలు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు

Father In law
కరోనా వైరస్ బారిన పడిన వృద్ధులను పట్టించుకునేవారు కరవయ్యారు. ఆసుపత్రుల్లో వారిని అనాథలుగా వదిలేస్తున్నారు. అయితే అస్సాంకు చెందిన ఒక మహిళ మాత్రం సాహసమే చేసింది. కరోనా సోకిన తన 75 ఏళ్ల మామగారిని భుజాలపై మోసుకుంటూ హాస్పిటల్‌కు తరలించింది.

కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేనందువల్ల, స్వయంగా బాధితుడిని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. దీంతో వృద్ధుడిని కాపాడటానికి ఆమె వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని రాహాలో భాటిగావ్‌ ప్రాంతానికి చెందిన సూరజ్, నిహారిక కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. సూరజ్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో అతడి త్రండి తులేశ్వర్ దాస్ (75) బాధ్యతలను నిహారిక చూసుకుంటోంది. ఈ క్రమంలో తులేశ్వర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కోవిడ్ సోకడం వల్ల వీరికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నిహారిక స్వయంగా తన మామను భుజాలపై మోసుకొని రాహాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించింది. అయితే ఆ తరువాత ఆమెకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
 
బాధితులు ఇద్దరికీ ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ సంగీత ధార్, ఆరోగ్య కార్యకర్త పింటు హీరా ప్రాథమిక చికిత్స అందించారు. తులేశ్వర్ దాస్‌ను పరీక్షించి, అతడిని చికిత్స కోసం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపించాలని చెప్పారు. నిహరికను ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచించారు. 
 
అయితే వృద్ధుడైన తన మామగారిని ఒంటరిగా హాస్పిటల్‌లో వదిలేసేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో వీరిద్దరినీ అంబులెన్స్‌లో నాగాన్ భోగేశ్వరి ఫుకానాని సివిల్ హాస్పిటల్‌ కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. కరోనా నేపథ్యంలో కుటుంబం కోసం బాధ్యతగా వ్యవహరించిన నిహారికను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.