శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (13:46 IST)

నెల్లూరులో ఖరారైన తొలి కరోనా కేసు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వపరంగా జరగాల్సిన అనేక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. అలాగే, కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
నెల్లూరు పట్టణం, చిన్నబజారుకు చెందిన 24 యేళ్ల యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. అతడు నెల్లూరుకు వచ్చే సమయంలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉన్నాడు. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని భావించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. 
 
ఆ తర్వాత అతని రక్తాన్ని సేకరించి పూణెలోని వైరాలజీ పరిశోధనాశాలకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో జరగాల్సిన పలు కార్యక్రమాలను వాయిదా వేశారు.