ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (11:03 IST)

తగ్గని కరోనా దూకుడు .. కొత్తగా 2.86 లక్షలు - మృతులు 573

దేశంలో కరోనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ రోజువారీగా నమోదయ్యేయ కరోనా కేసుల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... 
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,86,384 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 573 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3.06.357 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్లు..
ఇదిలావుంటే, ప్రస్తుతం కరోనా వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు వీలుగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కోవిషీల్డు, కోవ్యాగ్జిన్ టీకాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ టీకాలనే ఇపుడు వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ రెండు టీకాలకు బహిరంగ మార్కెట్ ధరను ఖరారు చేశారు. 
 
ఈ రెండు టీకాల ఒక్కో డోసు టీకా ధర రూ.275గా ఖరారు చేయగా, సర్వీసు చార్జీల రూపంలో మరో రూ.150ను అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధరలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ ధర రూ.1200గాను, కోవిషీల్డ్ ధర రూ.780 లభ్యమవుతుంది. 
 
అయితే, ఇప్పటివరకు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమై ఈ రెండు టీకాలను ఇకపై బహిరంగ మార్కెట్‌లోకి తెచ్చేందుకు వీలుగా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ)కు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తును కోవిడ్ నిపుణుల కమిటి పరిశీలించి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.