శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (11:05 IST)

మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ప్రపంచంలో రెండో దేశంగా భారత్

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. 
 
మంగళవారం ప్రకటన మేరకు దేశంలో మొత్తం 2,55,874 పాజిటివ్ కేసులు నమోదుకాగా బుధవారం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు 2,85,914కు చేరుకుంది. అలాగే, 665 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశంలో ఈ వైరస్ నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. 
 
ఇదిలావుంటే, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఫలితంగా గత మూడు వారాల వ్యవధిలో ఏకంగా 50 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమలో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల మార్కును దాటేసింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ నిలిచింది. 7.3 కోట్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.