శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (21:22 IST)

స్మృతి ఇరానీకి కరోనా : ఏపీలో కొత్త పాజిటివ్ కేసులెన్ని?

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు ఈ వైరస్ సోకగా, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని తిరిగి కోలుకున్నారు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. 
 
తనకు కరోనా సోకినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనతో కాంటాక్ట్ అయినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు. మరోవైపు, స్మృతి త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు, పార్టీ కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 2,949 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,774కి చేరుకుంది. మొత్తం 6,643 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇంకోవైపు, గత 24 గంటల్లో 3,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 77,028 మంది కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. 
 
ప్రస్తుతం ఏపీలోని జిల్లాల్లో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 1259, చిత్తూరు 2679, ఈస్ట్ గోదావరి 4877, గుంటూరు 3603, కడప 1404, కృష్ణ 3082, కర్నూలు 485. నెల్లూరు 288, ప్రకాశం 1705, శ్రీకాకుళం 987, విశాఖపట్టణం 2048, విజయనగరం 2048, వెస్ట్ గోదావరి 3836 చొప్పున మొత్తం 26622 యాక్టివ్ కేసులు ఉన్నాయి.