గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2020 (11:39 IST)

దేశంపై కరోనా పంజా : 30 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

దేశంపై కరోనా పంజా విసిరింది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ కారణంగా దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటిపోయాయి. గడచిన 24 గంటల్లో 69,239 మందికి కరోనా సోకింది. అదేసమయంలో 912 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇకపోతే, దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 30,44,941 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 56,706  పెరిగింది. ఇక 7,07,668 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,80,567 మంది కోలుకున్నారు.
 
అలాగే, శనివారం వరకు మొత్తం 3,52,92,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులోనే 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణాలో పాజిటివ్ కేసులెన్ని? 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 2384 మందికి ఈ వైరస్ సోకింది. శనివారం ఒక్కరోజు 11 మంది చనిపోయారు. ఈ మృతులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 755 మంది చనిపోయారు. 
 
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1,04,249 నమోదు కాగా, ఇప్పటివరకు 78,735 మంది రికవరీ కాగా.. 22,386 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  మృతుల సంఖ్య మొత్తం 755కు  చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 మందికి కొత్తగా కరోనా సోకింది.
 
రాష్ట్రంలో 15,933 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెచ్‌ఎంసీ 447, జగిత్యాల 91, ఖమ్మం 125, మేడ్చల్ 149, నల్గొండ 122, నిజామాబాద్ 153, రంగారెడ్డి 201, వరంగల్ అర్బన్ 123 కేసులు నమోదయ్యాయి.