1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (09:44 IST)

భగవంతుడి దయ వల్ల కరోనా నుంచి కోలుకున్నా : జెనీలియా

కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా కూడా చేరింది. ఈమె కరోనా వైరస్ బారినపడిన సమాచారాన్ని ఎక్కడా కూడా బయటకు రానివ్వలేదు. అయితే, కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని మాత్రం ఆమె తాజాగా బహిర్గతం చేసింది. భగవంతుడి దయ వల్ల కరోనా నుంచి కోలుకున్నట్టు ఈమె తెలిపింది. 
 
జెనీలియా తెలుగులో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ తనయుడు, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లి అయింది. ఈ క్రమంలో ఈమె కరోనా వైరస్ బారినపడి కోలుకుంది. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా ఆమె వెల్లడించింది. 
 
మూడు వారాల క్రితమే తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని... అయితే, లక్షణాలు లేవని ఆమె తెలిపింది. ఆ తర్వాత 21 రోజుల పాటు తాను ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను కోలుకున్నానని... తాజా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపింది.
 
కరోనా వల్ల తాను ఎక్కువగా ఇబ్బంది పడకపోయినా... ఇన్ని రోజులు ఐసొలేషన్‌లో ఉండటం ఎంతో బాధించిందని ఈ సందర్భంగా జెనీలియా చెప్పింది. ఒంటరిగా గడపడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుని కుటుంబసభ్యుల మధ్యకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. 
 
మన చుట్టూ కావాల్సిన వాళ్లు ఉన్నప్పుడు... అది మనకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుందని చెప్పింది. ప్రతి ఒక్కరూ ముందుగానే టెస్టులు చేయించుకోవడం, ఫిట్‌గా ఉండటం, మంచి ఆహారం తీసుకోవడం చేస్తే... కరోనాపై విజయం సాధించవచ్చని తెలిపింది.