ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (23:27 IST)

ఆసియా కప్ : డూ ఆర్ డై మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఇక ఇంటికేనా?

sri lanka
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. సూపర్-4లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ ఓటమిని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చేతిలో ఓటమిని చవిచూసిన విషయం తెల్సిందే. 
 
ఈ మ్యాచ్‌లో గెలిచిన శ్రీలంక బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత 174 రన్స్ విజయంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు గట్టి పునాది వేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఓపెనర్ నిస్సాంక 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 52 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మెండీస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశారు. 
 
అయితే, జట్టు స్కోరు 97 పరుగుల వద్ద ఉండగా నిస్సాంక (52), అదే స్కోరు వద్ద మెండీస్‌ (57)లతో పాటు అస్లంకా (0), గుణతిలక (1) వికెట్లను కూడా కోల్పోయింది. ఒక దశలో 97 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఉన్న లంకేయులు 110 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (25), షనక (33) చొప్పున పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో లంక జట్టు19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలుపొందింది. ఈ ఓటమితో భారత్ ఫైనల్‌కు చేరే అవకాశాలను కోల్పోయిందని చెప్పొచ్చు. 
 
నిరాశపరిచిన మిడిల్ ఆర్డర్... భారత్ 173/8 
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశపరిచారు. ఒక దశలో కష్టాల్లో ఉన్నట్టు కనిపించిన జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఆదుకున్నారు. దీంతో ఆ మాత్రం పరుగులనైనా చేయగలిగింది. 
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (6), ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (0) ఇద్దరూ విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో బ్యాటింగ్‌ కుప్పకూలకుండా జాగ్రత్త పడిన రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) రాణించారు. 
 
ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేక పోయారు. పాండ్యా 17, పంత్ 17, హుడా 13 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. మ్యాచ్ ఆఖరులో అశ్విన్ 7 బంతుల్లో 15 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. భువి డకౌట్ కాగా, అర్షదీప్ సింగ్ (1) నాటౌట్‌గా నిలిచాడు. 
 
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లతో చెలరేగగా.. చమిక కరుణరత్నే, శనక చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తీక్షణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.