శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (08:50 IST)

అరుదైన రికార్డుకు చేరువలో మను బాకర్.. ఇప్పటికే రెండు పతకాలు...

Manu Bhaker
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత షూటర్ మను బాకర్ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. షూటింగ్ విభాగంలో ఇప్పటికే రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్న ఆమె.. ఇపుడు మూడో పతకానికి చేరువయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో శనివారం 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో మను బాకర్ ఫైనల్‌కు చేరింది. 22 యేళ్ల మను బాకర్ శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో మెరుగైన ప్రతిభ కనపరచడంతో మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. కాగా, మను బాకర్ ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. ఇపుడు మూడో పతకం కూడా సాధిస్తే ఆమె పేరు భారత ఒలింపిక్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. 
 
మరోవైపు, పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించాడు. చైనీస్ తైపీకి చెందిన ప్లేయర్ తియెన్ చెన్ చౌపై 19-21, 21-15, 21-12 తేడాతో విజయం సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సెమీ ఫైనల్‌ చేరుకున్న భారత తొలి ఆటగాడిగా లక్ష్యసేన్ రికార్డులకు ఎక్కాడు.
 
రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ సెట్‌లో 21-19 తేడాతో లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాతి రెండు గేమ్‌లలో అద్భుతంగా పుంజుకున్నాడు. రిటర్న్ సర్వ్‌లను మెరుగుపరుచుకుని చూడచక్కనైన షాట్లు ఆడాడు. ప్రత్యర్థి ఆటగాడి షాట్లను తెలివిగా అంచనా వేసి రెండో సెట్‌లో 21-15తో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. 
 
ఇక నిర్ణయాత్మకమైన మూడవ సెట్‌లో లక్ష్యసేన్ మరింత చెలరేగాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. తియెన్ చెన్ స్కోరు సాధించకుండా నిలువరించి 21-12తో మూడవ సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో చిరస్మరణీయమైని విజయాన్ని సొంతం చేసుకుని సెమీ ఫైనల్‌కు చేరాడు.