గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (10:54 IST)

ఐపీఎల్ కోసం మెగా వేలం వద్దనే వద్దంటున్న బాలీవుడ్ అగ్రహీరో!!

ipl2015
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలం పాటలను నిర్వహించవద్దని బాలీవుడ్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారూక్ ఖాన్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌కు చెందిన పది ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య కీలక సమావేశం బుధవారం జరిగింది. అయితే, ఈ సమావేశం అసంపూర్ణంగానే ముగిసినట్లు సమాచారం. ముంబై వేదికగా బుధవారం రాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్, ఇంపాక్ట్ రూల్స్‌ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. 
 
బీసీసీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించింది. మరోసారి భేటీకి అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. మెగా వేలం నిర్వహణకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనకు రాయల్స్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు యాజమాన్యం అండగా నిలిచినట్టు సమాచారం. 
 
అయితే, ఈ సమావేశంలో పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా, షారుఖ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మెగా వేలం నిర్వహణతోపాటు రిటెన్షన్‌లో ఎంతమందిని అట్టిపెట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. షారుఖ్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవాలని కోరుతుండగా.. నెస్ వాడియా మాత్రం అవసరం లేదని వాదించినట్లు సమాచారం. మెగా వేలం నిర్వహించాలని నెస్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు, 'మెగా వేలంపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. అదే రిటెన్షన్ సంఖ్యను నిర్దేశించనుంది. వేలం నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తే.. రిటెన్షన్ అవసరమే ఉండకపోవచ్చు. మెగా వేలం నిలుపుదలపై షారుఖ్, నెస్ వాడియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. షారుఖ్ అనుకూలంగా ఉండగా.. నెస్ మాత్రం నిర్వహించాలని కోరారు. రిటైన్ చేసుకొనే అంశంపైనా పది ఫ్రాంచైజీల్లోని ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొత్త వారికి అవకాశం దక్కుతుందని కొన్ని ప్రాంచైజీలు వాదించాయి' అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.