1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (09:40 IST)

కేకేఆర్ మెంటర్ గౌతం గంభీర్‌కు బ్లాంక్ చెక్కును ఆఫర్ చేసిన షారూక్ ఖాన్!!

sharukh  - gambhir
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్ టీమ్) జట్టు మెంటర్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యజమాని, బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ బ్లాంక్ చెక్కును ఆఫర్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆదివారం రాత్రి చెన్నైలోని చెప్పాకం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్‌ అంతిమ పోరులో కేకేఆర్ జట్టు విజేతగా నిలించింది. తద్వారా రూ.20 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుంది. దీంతో కేకేఆర్ జట్టు యాజమాన్యం సంబరాల్లో మునిగిపోయింది. అయితే, ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు విజేతగా నిలవడం వెనుక మెంటర్ గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం, ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ద్వారా జట్టుని విజేతగా నిలపడంలో తనవంతు పాత్ర పోషించాడు. 
 
ఈ నేపథ్యంలో గెలిచిన నేపథ్యంలో గంభీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ ఏకంగా 'బ్లాంక్ చెక్'ను ఆఫర్ చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలంటూ షారుఖ్ అడిగారని తెలిపింది. గంభీర్‌ను ఎక్కువ కాలం పాటు జట్టుతో ఉంచాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ భారీ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ సహ యజమాని అనే విషయం తెలిసిందే.
 
కాగా టీమిండియా కోచ్ రేసులో మాజీ క్రికెటర్ గౌతమ్ ముందు వరుసలో ఉన్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పలువురు విదేశీ కోచ్‌ రేసు నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ముందు పెద్దగా ఆప్షన్లు లేవని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడు గౌతమ్ గంభీరేనని చెబుతున్నాయి. మరోవైపు గంభీర్ కూడా భారత కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు 'దైనిక్ జాగరణ్' కథనం పేర్కొంది. ఒకవేళ టీమిండియా కోచ్చ్‌గా వ్యవహరిస్తే కోల్‌కతా జట్టుకు మెంటార్గా కొనసాగడం కుదురుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.