బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (14:16 IST)

సిడ్నీ టెస్టుకు భారత క్రికెట్ టెస్ట్ జట్టు ఎంపిక

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం భారత జట్టును ప్రకటించారు. ఫామ్ కోల్పోయి పరుగులు చేయడంలో విఫలమవుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తప్పించి, ఫిట్నెస్ నిరూపించుకున్న రోహిత్ శర్మకు స్థానం కల్పించారు. 
 
ఇక, యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ గాయపడడంతో ఆ స్థానానికి శార్దూల్ ఠాకూర్, నటరాజన్‌ల పేర్లను కూడా పరిశీలించిన టీమ్ మేనేజ్‌మెంట్, ఎక్స్‌ప్రెస్ వేగంతో బౌలింగ్ చేసే సైనీ వైపే మొగ్గుచూపింది. కాగా, నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా, టీమిండియా చెరో టెస్టు గెలిచి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి.
 
మూడో టెస్టులో ఆడే భారత జట్టు ఇదే...
అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ.
 
మరోవైపు, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు విధిగా ముఖానికి మాస్క్ ధరించాలన్న షరతు విధించారు. ముఖ మాస్క్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఒకవేళ నిబంధన పాటించకపోతే వెయ్యి డాలర్ల అపరాధం విధిస్తామని హెచ్చరించింది. 
 
ఇదిలావుంటే, బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి వ‌చ్చిన ఓ అభిమానికి క‌రోనా సోకిన‌ట్లు మెల్‌బోర్న్ క్రికెట్ క్ల‌బ్ (ఎంసీసీ) వెల్ల‌డించింది. అయితే ఆ వ్య‌క్తికి మ్యాచ్ చూసే స‌మ‌యంలో మాత్రం ఇన్ఫెక్షన్ లేద‌ని తెలిపింది. 
 
ఈ ఘ‌ట‌న‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఇప్ప‌టికే అత‌నితోపాటు క‌లిసి మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకొని, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ (డీహెచ్‌హెచ్ఎస్‌) ఆదేశాలు జారీ చేసింది. 
 
డిసెంబ‌ర్ 27, జ‌న‌వ‌రి 27న మెల్‌బోర్న్ స్టేడియంలోని ది గ్రేట్ స‌ద‌ర్న్ స్టాండ్‌లో కూర్చొని మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి 3.30 గంట‌ల వ‌ర‌కు మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు ఎంసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ప్ర‌తి రోజూ స్టేడియంలో భారీ ఎత్తున క్లీనింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించిన‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా ఎంసీసీ చెప్పింది. ఇప్పుడా క‌రోనా సోకిన వ్య‌క్తి ఉన్న స్టాండ్స్‌ను మ‌రోసారి శానిటైజ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియంలో మొత్తం 275 శానిటైజింగ్ స్టేష‌న్ల‌ను కూడా ఏర్పాటు చేశారు.