1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

ఇంటర్వ్యూ పేరుతో షాపింగ్‌కు పిలిచి మహిళా టెక్కీపై అత్యాచారం.. ఎక్కడ?

rape
మెరుగైన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఓ మహిళా టెక్కీపై కామాంధుడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటర్వ్యూ పేరుతో షాపింగ్ మాల్‌కు పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్ సెల్లార్‌లో జరిగింది. తుషార్ శర్మ అనే వ్యక్తి తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కారులో అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఓ మహిళ టెక్కీ ఉద్యోగం చేస్తూ మరింత మెరుగైన ఉద్యోగయత్నాల్లో నిమగ్నమైంది. ఈమెకు తుషార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం లభించేలా చేస్తానంటూ హామీ ఇచ్చాడు. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని చెప్పాడు. అతని మాటలు నిజమని నమ్మిన ఆ మహిళ తన సర్టిఫికేట్లతో అక్కడకు వెళ్లింది. 
 
ఈ క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకుని షాపింగ్ మాల్ బేస్‌‍మెంట్‌లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెకు మత్తు కలిపిన మంచినీళ్లు ఇచ్చాడు. వాటిని తాగగానే ఆ యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై కారులోనే అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె స్పృహలోకి వచ్చాక.. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై విష ప్రయోగం, అత్యాచారం, నేరపూరితంగా బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నిందితుడి ఆచూకీని కనుగొనేందుకు మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.