సంబంధిత వార్తలు
అంగట్లో కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి...
ఓ తల్లి కన్నబిడ్డను అంగట్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో భిక్షాటన చేసే మహిళకు తొమ్మిది నెలల మగబిడ్డ ఉన్నాడు. బిడ్డను రూ.1.20 లక్షలకు విక్రయించాలని ఆమెకు నగరానికే చెందిన ఒక మహిళ డబ్బు ఆశచూపింది. అందుకు ఆ తల్లి సరేనంది. డబ్బులు ఇవ్వడంతో మూడు రోజుల క్రితం నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తికి పసికందును అప్పగించింది. ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో మగబిడ్డను అక్రమంగా కొన్నాడు.
యాచకురాలి వద్ద బిడ్డ కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన ఓ స్థానికుడు 1098 టోల్ ఫ్రీకి సమాచారం ఇచ్చాడు. బాలల సంరక్షణ విభాగం వారు నగరంలోని ఒకటో ఠాణా పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. బిడ్డను కొన్న వ్యక్తిని శనివారం ఠాణాకు పిలిపించారు. ఆ వ్యక్తితో పాటు పసిబిడ్డ తల్లిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.
బిడ్డను బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించామన్నారు. ఈ ఘటనలో మధ్యవర్తి, మరో ఇద్దరి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నామన్నారు. నిందితులని తేలితే వారిపై చర్యలు తప్పవన్నారు. వారం రోజుల కిందట నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మహిళ ఇదే తరహాలో మగబిడ్డను విక్రయించిన ఘటన వెలుగుచూడగా.. నలుగురిపై కేసు నమోదైంది.
