పిల్లలు లేరని దత్తత తీసుకుంటే తండ్రినే కడతేర్చాడు...
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ దత్తపుత్రుడు చేతిలోనే హతమయ్యాడు. సంతానం లేకపోవడంతో ఓ యువకుడిని దత్తత తీసుకోగా, పెరిగి పెద్దవాడైన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లికి చెందిన ఎండీ అంకూస్(58) ములుగు జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫాతిమాబేగం - అంకూస్ దంపతులకు సంతానం కలగకపోవడంతో ఆయూబ్ పాషాను దత్తత తీసుకున్నారు.
ఆయూబ్ పాషా సీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం ముగ్గురి మధ్య ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తర్వాత అంబులెన్స్లో అంకూస్ను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతదేహంపై గాయాలుండగా, చెవి నుంచి రక్తస్రామైంది. భార్య, దత్తపుత్రుడు అతనిపై దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి మహబూబీ ఫిర్యాదు మేరకు భార్య ఫాతిమాబేగం, ఆయూబ్ పాషాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ తెలిపారు.
ఈ ఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్ఐ బుధవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సభ్యులు వివరాలు సేకరించారు.
