ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఓ దారుణం జరిగింది. సొంత కుమార్తెను ఆమె ప్రియుడితోనే కన్నతండ్రి హత్య చేయించాడు. ఆమె వల్ల కుటుంబం పరువుపోతోందని అందువల్ల అడ్డు తొలగించుకోవాలని సూచించాడు. దీంతో ప్రియుడు తన ప్రియురాలి గొంతునులిమి హత్య చేసి, మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి, పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేశారు. దీంతో పోలీసులు వచ్చి ప్రియుడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం మేరకు... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (33) అనే మహిళకు ఇప్పటికే రెండు వివాహాలై విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో కరీంనగర్కు చెందిన వినోద్ కుమార్తో సన్నిహితంగా ఉంటోంది. అయితే, గత వారం అరుణాచలం వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి, ప్రియుడు వినోద్ కుమార్ గదికి వెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని వినోద్ కుమార్.. మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
తమ మాట వినకుండా ఆమె ఇష్టారీతిన తిరుగుతోందని, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మానస వల్ల తమ పరువు పోతోందని, చంపేయమని వినోద్కు చెప్పాడు. ఏదైనా చేసి ఆమె వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని కోరాడు. వెళ్లి చేసుకోవాలని వేధిస్తుండటం, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండటంతో మానస, వినోద్ మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో వినోద్.. మానస గొంతు నులిమ చంపేశాడు. అనంతరం కారు డిక్కీలో మృతదేహాన్ని పెట్టి ఎల్కతుర్తిలోని తన ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా దుర్వాసన రావడంతో స్థానికులు గురించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఎల్కతుర్తి శివారులో వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.
