బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (18:53 IST)

ఐపీఎల్ సందడి స్టార్ట్ : యూఏఈకి జట్లు పయనం.. కనిపించని కోహ్లి

దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్ పోటీలు కరోనా వైరస్ కారణంగా యూఏఈలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమై నవంబరు పదో తేదీతో ముగియనున్నాయి. మొత్తం మూడు వేదికల్లో అంటే దుబాయ్, అబుదాబి, షార్జాల్లో ఈ మ్యాచ్‌లన్నీ జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో క్రీడాకారుల సందడి మొదలైంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్‌ ఎలెవన్‌, కోల్‌కతా జట్లు యూఏఈ చేరగా శుక్రవారం ముంబై, చెన్నై, ఆర్‌సీబీ జట్లు కూడా ప్రత్యేక విమానాల్లో యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరట్స్‌కు చేరుకున్నారు. 
 
ఆర్‌సీబీ ఆటగాళ్లు యూఏఈ వెళ్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఫొటోల్లో ఎక్కడా కూడా విరాట్‌ కోహ్లీ మాత్రం కనిపించలేదు. ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ మాస్కులు, ఫేస్‌ కవర్లు ధరించారు. పార్థివ్‌ పటేల్‌, చాహల్, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, నవదీప్‌ శైనీ, సుందర్‌, పవన్‌నేగి తదితర ఆటగాళ్లు ఉన్నారు. 
 
అయితే వారిలో విరాట్‌ కోహ్లీ కనిపించడం లేదు. దీంతో ఆర్‌సీబీ అభిమానుల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. 'కింగ్ ఎక్కడ', 'కోహ్లి కనిపించడం లేదు', 'కోహ్లి వీరితో రావడం లేదా', 'కోహ్లి ప్రత్యేక విమానంలో వస్తున్నాడా' అని విరాట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే కోహ్లి ప్రయాణంపై ఫ్రాంచైజీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 
 
ఇదిలావుండగా, ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్‌ గెలువలేదు. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ ప్రతీసారి ఏదో విషయంలో దెబ్బతింటుంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో విరాట్‌తో పాటు జట్టు సభ్యులు ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు, ఐపీఎల్ -2020 టైటిల్‌ స్పాన్సర్‌గా ఫాంటసీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫాం డ్రీమ్‌ 11తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌-13వ సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం డ్రీమ్‌ 11 రూ.222కోట్లకు బిడ్‌ వేసి హక్కులను దక్కించుకుంది. 
 
ఈ నేపథ్యంలో గత టైటిల్‌ స్పాన్సర్‌ వివో స్థానంలో డ్రీమ్‌ 11 సింబల్‌ను ఐపీఎల్‌-2020 లోగోలో  చేర్చారు. కొత్త లోగోను ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 
 
ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు పాల్గొననున్నాయి.