శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (15:35 IST)

మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా నిర్ధారణ టెస్ట్... రిజల్ట్ ఏమిటి?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2020 పోటీలు యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో ధోనీ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. జట్టు సహచరుడు మోనూ సింగ్‌తో కలిసి రాంచీలో కరోనా టెస్టులకు శాంపిల్స్ ఇచ్చాడు. గురువారం సాయంత్రానికి ధోనీ కరోనా పరీక్షల నివేదిక రానుంది.
 
ఈ పరీక్షల్లో నెగెటివ్ వస్తే ధోనీ చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొంటాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ నెల మూడో వారంలో చెన్నై జట్టు యూఏఈ వెళ్లనుంది. కాగా, వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనడంలేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. 
 
కాగా, ఇప్పటికే ఐపీఎల్‌లో కరోనా కలకలం చెలరేగింది. ఐపీఎల్ ప్రాంఛైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్ కొనసాగుతున్నారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. యాగ్నిక్‌తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది.