శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:31 IST)

డేటా చార్జీల మోత తప్పదు.. సంకేతాలు పంపిన ఎయిర్‌టెల్

దేశంలో మున్ముందు డేటా చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సంకేతాలు పంపించింది. అమెరికా తరహాలో అధిక ధరలను వసూలు చేయబోమని, అలాగని అతి తక్కువ ధరకు డేటాను ఇవ్వలేమని స్పష్టం చేసింది. అందువల్ల వచ్చే ఆర్నెలల్లో డేటా చార్జీల మోత తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం డేటా చార్జీలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని, రూ.160కే నెలకు 16జీబీ డేటా వినియోగం విషాదకరమన్నారు. 'వినియోగదారులు ఇదే రేటుతో నెలకు 1.6 జీబీ వినియోగంతో సరిపెట్టుకోవడం లేదంటే అధిక రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 
 
పైగా, అమెరికా, యూరప్‌ తరహాలో నెలకు 50-60 డాలర్లు వసూలు చేయాలనుకోవడం లేదు. కానీ, 2 డాలర్ల కంటే తక్కువ రేటుకే 16జీబీ డేటా అందించలేమని ఆయన తెలిపారు.
 
డిజిటల్‌ కంటెంట్‌ వినియోగం పెరుగుతుండటంతో వచ్చే ఆరు నెలల్లో ఒక్కో వినియోగదారు నుంచి ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 దాటొచ్చని మిట్టల్‌ అన్నారు. ఎయిర్‌టెల్‌తో పాటు మిగతా కంపెనీలు చివరిసారిగా 2019 డిసెంబరులో చార్జీలు పెంచిన విషయం తెల్సిందే.