గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:14 IST)

ఇపుడు డెల్ వంతు ... 6500 మంది ఉద్యోగులను ఇంటికి

dell logo
ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇపుడు మరో కంపెనీ సిద్ధమైంది. కంప్యూటర్ల తయారీలో దిగ్గజ కంపెనీ గుర్తింపు పొందిన డెల్ కంపెనీ 6500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెల్ ఉద్యోగుల్లో ఐదు శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
 
ఇదే అంశంపై డెల్ సహ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ పేరిట ఓ సర్క్యులర్ జారీ అయింది. అందులో "ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ పరిస్థితులను ప్రస్తుతం డెల్ కూడా ఎదుర్కొంటుంది. అనిశ్చితితో కూడిన భవిష్యత్తు క్షీణదిశ వైపు పయనిస్తుంది. గతంలోనూ ఆర్థిక మాంద్యాన్ని చవిచూశాం. కానీ, మరింత బలంగా తయారయ్యాం. ఇపుడు కూడా అంతే. మార్కెట్ పుంజుకోగానే మళ్లీ పూర్వస్థితిని అందుకుంటాం" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. 
 
కాగా కరోనా మహమ్మారి కారణంగా 2022 నాలుగో త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ విక్రయాలు పడిపోవడంతో అనేక కంప్యూటర్ తయారీ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయని టెక్ అనలిస్ట్ ఐడీసీ వెల్లడించింది. డెల్ కూడా ఇతర కంపెనీల బాటలోనే నడుస్తుంది. 2021 నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2022 త్రైమాసికంలో 37 శాతం నష్టాలను చవిచూసిందని ఐడీసీ వెల్లడించింది. 
 
కాగా, డెల్ కంపెనీని వచ్చే ఆదాయంలో 55 శాతం ఆదాయం పర్సనల్ కంప్యూటర్ విక్రయం ద్వారానే వస్తుంది. ఇపుడు ఈ తరహా కంప్యూటర్ల విక్రయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆ కంపెనీ ఆదాయంలో కూడా భారీ క్షీణత కనిపించింది.