శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:46 IST)

కరోనా టీకా పంపిణీ ప్రారంభమైతే సీఏఏ చట్టం సంగతి చూస్తాం : అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు చేపట్టింది. దీనికి పౌరసత్వ సవరణ చట్టం అనే పేరు పెట్టారు. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ వివాదాస్పద చట్టాన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. దీంతో ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మరుగునపడిపోయింది. 
 
దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కరోనా కారణంగా మరుగున పడిందని, దేశంలో టీకా పంపిణీ ఒకసారి మొదలు కాగానే దాని సంగతి చూస్తామని తెలిపారు. 
 
ఈ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించడం ఓ భారీ ప్రక్రియ అని, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కొనసాగించడం కష్టమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ అందుబాటులోకి వచ్చి కరోనాను ఖతం చేసిన తర్వాత మాత్రమే సీఏఏపై దృష్టి సారిస్తామన్నారు.
 
అదేసమయంలో వెస్ట్ బెంగాల్ పర్యటనకు వెళ్లిన తమ పార్టీ అధినేత జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరాచక శక్తులు దాడి చేయడాన్ని అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు మమత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 
 
బెంగాల్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలన్న కేంద్రం లేఖను మమత తీవ్రంగా తప్పుబట్టడంపై స్పందించిన షా, ఐపీఎస్ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి లేఖ రాయడం చట్టబద్దమేనని షా తేల్చి చెప్పారు.