1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (13:14 IST)

దేశంలో పంజా విసురుతున్న కరోనా వైరస్.. తెలంగాణలో 247 కేసులు

దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,903 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. కొత్తగా 17,741 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,45,284 మంది డిశ్చార్జి అయ్యారు. మరో వైపు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,59,044కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 2,34,406 ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. 

తెలంగాణాలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 247 కేసులు నమోదుకాగా ముగ్గురు చనిపోయారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.01 లక్షలకు చేరుకోగా 1659 మంది మృతి చెందారు. 
 
కరోనా వ్యాధి నుంచి 2.98 లక్షల మంది కోలుకోగా 2101 చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 29 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 93.59 లక్షల మంది కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
 
హైదరాబాద్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని నాగోల్ బండ్లగూడ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌లో 38 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్‌గా పరీక్షల్లో తేలినట్లు సమాచారం.