1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 19 అక్టోబరు 2021 (17:15 IST)

పారదర్సకంగా తిరుమల లడ్డూ కౌంటర్ల నిర్వహణ, శ్రీవారి భక్తుల్లో ఆనందం..!

తిరుమల స్వామివారి దర్సనం తరువాత ప్రతి ఒక్కరు లడ్డూ ప్రసాదాన్ని వెంటపెట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటారు. స్వామివారి లడ్డూ అంటే చాలామందికి ఇష్టం. ఎవరు దర్సనానికి వెళ్ళి వచ్చినా సరే లడ్డూ తెచ్చారా అని అడుగుతూ ఉంటారు. అలాంటి లడ్డూ నిర్వహణ ప్రస్తుతం తిరుమలలో పారదర్సకంగా జరుగుతోంది.
 
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల కౌంటర్ల నిర్వహణ పారదర్సకంగా జరుగుతోందని టిటిడి తెలిపింది. రద్దీకి తగ్గట్లుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారట.
 
లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62కౌంటర్లు ఉన్నాయి. వీటిలో 55 కౌంటర్లను టెండరు ద్వారా బెంగుళూరుకు చెందిన కెవిఎం ఇన్ ఫో సంస్దకు టిటిడి కేటాయించింది. కోవిడ్ నేపథ్యంలో తిరుమలకు ఇంకా పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించకపోవడంతో రోజుకు 25 వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు దర్సనానికి వస్తున్నారు.
 
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు ఆరు బ్యాంకులు స్పాన్సర్‌షిప్ అందించాయి. బ్యాంకులు ఒక్కో కౌంటర్‌కు నెలకు సుమారు 40,365 రూపాయలు స్పాన్సర్‌షిప్‌గా చెల్లిస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు 10, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు 5, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3, కెనరా బ్యాంకు 3, ఫెడరల్ బ్యాంకు 3, తిరుమల బ్యాంకు 2, కౌంటర్లకు స్పాన్సర్ షిప్ చేశాయి.
 
తగినన్ని లడ్డూ కౌంటర్లు ఉండడంతో భక్తులు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రసాదాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో లడ్డూ తీసుకోవాలంటే చాలా సమయం పడుతుండేది. అయితే ప్రస్తుతం చాలా తక్కువ సమయంలోనే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పొందుతున్నారు. దీంతో భక్తులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.