1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 3 జూన్ 2016 (15:27 IST)

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవనాలు - తితిదే ఈఓ సాంబశివరావు

పర్యావరణానికి పెద్దపీట వేయాలని తితిదే ఈఓ సాంబశివరావు నిర్ణయం తీసుకున్న కొన్నిరోజులకే వాటిని అమలు చేయనున్నారు తితిదే అధికారులు. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవనాలు ఏర్పాటు చేసి పచ్చదనంగా మార్చనున్నారు. ఏ కాలంలోనైనా భక్తులు ఆలయ సమీపంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ ఉండాలనే ఉద్దేశంతో తితిదే ఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
తిరుమలలో జరిగిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో సాంబశివరావు పాల్గొని భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తిరుమలలోని కొన్ని సముదాయాల్లో తితిదే సిబ్బంది గదులను ఖాళీ చేసే సమయంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈఓ గతంలో కూడా తమకు ఫిర్యాదులు వచ్చాయని, మీరు గదులు ఖాళీ చేసే సమయంలో మిమ్మల్ని డబ్బులు అడిగిన వారి వివరాలను చెబితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈఓ. శుభప్రదం కార్యక్రమాన్ని భక్తులు మెచ్చుకున్నారు. శుభప్రదం ఎంతో బృహత్తర కార్యక్రమమన్నారు.
 
డయల్‌ ఈఓ కార్యక్రమం తరువాత ఈఓ మాట్లాడుతూ చందనం అవసరం ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం పండిస్తున్న 30 హెక్టార్లలో కాకుండా మరో 70 హెక్టార్లలో చందనాన్ని పండించనున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆలయం చుట్టూ పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే తిరుమల తిరుపతి వెళ్లే ఘాట్‌రోడ్డు, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్‌ రోడ్డులలో కూడా రోడ్డుపొడవునా చెట్లు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. శ్రీవారి సేవకుల సేవలను తితిదే ఈఓ కొనియాడారు. ఎంత రద్దీ వచ్చినా సరే వారికి త్వరితగతిన దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు ఈఓ. వేసవి సెలవులు కావడంతో ఒక్క మే నెలలోనే 25 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, తితిదే చరిత్రలో ఇది ఓ రికార్డన్నారు ఈఓ.