ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణాకు పెనుశాపం : కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరుకు శాపంగా మారిందని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 50 యేళ్ళు పాలిన కాంగ్రెస్, 20 యేళ్ళు పాలించిన తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశాయని ఆరోపించారు.
అలాగే, 'ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారింది. ఇవాళ్టి సమావేశం ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం. కేంద్రం, రాష్ట్రం.. పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే చర్చ జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. ఆ జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీలు రావాల్సి ఉంది.
పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తోంది. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించా. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించింది. కానీ, బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను పట్టించుకున్నవారే లేరు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశాం. పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. చంద్రబాబు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం' అని కేసీఆర్ వివరించారు.
