శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (14:19 IST)

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విషాదం జరిగింది. ఇక్కడ విధులు నిర్వహించే కానిస్టేబుల్ ఒకరు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. 3.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. దీంతో ఇతర సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ రక్తపుమడుగులో పడివున్నాడు. 
 
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి విధులు హాజరైన ఆయన.. ఏం జరిగిందో ఏమోకానీ తెల్లవారుజామున తన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాసి పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
కాగా, కానిస్టేబుల్ తండ్రి దూసరి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. బాత్రూమ్‌కు వెళ్లిన బాలకృష్ణ తన తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపారు.