Black Magic: క్షుద్రపూజలు చేస్తున్నాడని 55 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారు..
నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే ఆరోపణలతో ఒక 55 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కడెం మండలం, ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గాంధీ గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య అనే వ్యక్తిని డిసెంబర్ 10వ తేదీ రాత్రి హత్య చేశారు.
అదే గ్రామానికి చెందిన ముత్తి నరేష్ (21), అతని అన్న మల్లేష్ (23) అనే ఇద్దరు నిందితులు భీమయ్యను హత్య చేసి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని కాల్చివేశారని ఆరోపణలు వచ్చాయి.
ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్, కడెం సబ్-ఇన్స్పెక్టర్ సాయి కిరణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో, భీమయ్య క్షుద్రపూజలు చేస్తున్నాడని, అందుకే తాము అతన్ని చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.