గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (10:04 IST)

జక్కన్న ఫ్యామిలీ నాకు దేవుడిచ్చిన వరం : జూనియర్ ఎన్టీఆర్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన చిత్రం తెల్లవారితే గురువారం. ఈ చిత్రానికి మణికాంత్‌ జెల్లీ దర్శకత్వం వహించగా, మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. దీనికి టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా ఏ కార్యక్రమంలోనూ మాట్లాడటానికి నేను ఇబ్బందిపడలేదు. కానీ, తొలిసారి ఇబ్బంది పడుతున్నా. నా తమ్ముళ్లు కాలభైరవ, సింహ గురించి మాట్లాడాల్సి రావటమే దానికి కారణం. వాళ్లు సాధించిన విజయం వర్ణించడానికి పదాలు దొరకడం లేదు. నా పిల్లలు అభయ్‌, భార్గవ్‌ ఏదైనా సాధించితే ఆనందంతో ఇలానే సైలెంట్‌ అవుతాను. వీళ్లను చూస్తే ఏ విధమైన అనుభూతికి లోనవుతున్నానో... రేపు నా పిల్లలను చూసి అలాగే అనుభూతి చెందుతానేమో! భైరవ, సింహా సక్సెస్‌ సినిమాకే పరిమితం కాకుండా యువతకు ఆదర్శప్రాయం కావాలి. ‘తెల్లవారితే గురువారం’ మంచి హిట్టవ్వాలి. తమ్ముళ్లిద్దరూ మరో మెట్టు ఎక్కాలి అని అన్నారు.
 
'మనం కుటుంబ సభ్యుల్లా భావించే వ్యక్తుల గురించి ఎక్కువగా మాట్లాడలేం. ఈ వేడుకలో నేను అలానే ఫీలవుతున్నా. గత ఇరవై ఏళ్లుగా కీరవాణి, జక్కన్న కుటుంబాలను దేవుడిచ్చిన కుటుంబాలుగా భావిస్తాను. నా మంచి, చెడులు.. కష్టాసుఖాల్లో.. జీవితంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక కీరవాణి, జక్కన్న కుటుంబాలున్నాయి. పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. సింహా, భైరవ విజయాల్ని చూసి కీరవాణి ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. ఇక పేరెంటింగ్‌ విషయంలో నేను రమా రాజమౌళి, వల్లి నుంచి ఎంతో నేర్చుకుంటాను. తమ పిల్లల్ని అందరు గర్వించేలా వాళ్లు తీర్చిదిద్దడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సింహా, భైరవ కెరీర్‌లో మరో మెట్టులా ఉపయోగపడాలని కోరుకుంటున్నా' అని అన్నారు.