1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (10:39 IST)

మహర్షి సినిమాకి మహేష్ యాడ్స్‌తో చిక్కులు..అందుకే ఆలస్యం

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షిపై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, పూజ హెగ్డె హీరోయిన్‌గా, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ పదేపదే వాయిదా పడుతోంది. 
 
మొదట ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించగా, అది కాస్తా ఏప్రిల్ 25కి వాయిదాపడింది. ఇంకా కూడా మహర్షి షూటింగ్ పూర్తి కాలేదు. పాటలతో సహా సినిమాలో కొంత భాగాన్ని ఇంకా చిత్రీకరించాల్సి ఉంది.

రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి షూటింగ్‌ని పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా విడుదల తేదీని మే 9కి వాయిదా వేసారు. ఈసారి అయినా మహర్షి చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో చెప్పిన తేదీన విడుదల చేయడానికి శ్రమిస్తోంది.
 
ఇంతలా ఆలస్యమవడానికి కారణం మహేష్ బాబే అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు తరచుగా వాణిజ్య ప్రకటనల కోసం బ్రేక్ తీసుకోవడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబు బాలీవుడ్ స్టార్స్‌తో ధీటుగా కార్పొరేట్ సంస్థలకు వాణిజ్య ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
మహేష్ క్రేజ్ గురించి తెలిసిన కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ మహేష్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి. మరి ఈసారి అయిన చెప్పిన తేదీన విడుదల చేయాలంటే మహేష్ చేతుల్లోనే ఉందటున్నారు నిపుణులు.