శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (16:40 IST)

చెన్నైలో నీటి కొరత అమ్మో.. హోటళ్లలో భోజనం కూడా కష్టమే.. (video)

తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కొరత తాండవం చేస్తోంది. తాగునీటికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. బిందెలను చేతబట్టుకుని నీటిలారీల ముందు క్యూలు కడుతున్నారు. చెన్నై నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీళ్లు భారీగా డబ్బులు చెల్లించి కొనాల్సి వస్తుంది. అవసరానికి తగిన నీరు.. తాగునీరు లభించడం కష్టమైపోతుంది. ముఖ్యంగా నీటికొరత కారణంగా వంట చేయలేక పలు హోటళ్లు మూతపడ్డాయి. 
 
ఈ ఏడాది తమిళనాడు మొత్తం మునుపెన్నడూ లేని విధంగా నీటికొరత ఏర్పడింది. దీంతో తమిళ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే రాజధాని నగరం చెన్నైలో నీళ్లు దొరకడమే గగనమైపోతోంది. తాగునీటి కోసం ప్రజలు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది.

చెన్నై ప్రజలు ప్రస్తుతం నీటి కోసం బిందెలతో రోడ్డుపై పడ్డారు. ఈ నీటి కొరత కుటుంబాలనే కాకుండా పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలను కూడా తాకింది. పాఠశాలల్లోనూ నీటి కొరత తప్పట్లేదు. ఇక విద్యార్థులు ఇంటి నుంచి వాటర్ బాటిల్స్‌లో నీటిని నింపుకెళ్తున్నారు. ఐటీ కంపెనీలకు నీటి కొరతతో ఇబ్బందులు తప్పలేదు. అందుచేత చాలామంది వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. దీంతో చెన్నైలో అద్దెలకు వుంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేసుకుని.. శివారు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని హోటళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది.
 
హోటళ్లలో వంటకు, తాగేందుకు ఇతరత్రా అవసరాలకు నీరు అధికంగా కావాల్సిన పరిస్థితి. అయితే నీటికొరత కారణంగా, భారీ మొత్తాన్ని వెచ్చించి.. నీటిని కొనలేక హోటళ్లు మూతపడిపోతున్నాయి. దీంతో హోటళ్లను నమ్ముకుని చెన్నైలో ఉద్యోగాలు చేసే వారికి భోజనం దొరకడం కూడా కష్టమైపోతోంది. దీంతో సోషల్ మీడియాలో తవిక్కుం తమిళనాడు.. (అలమటిస్తున్న తమిళనాడు) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.

ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా  నీటి కొరతకు సంబంధించిన అంశాలు, పరిష్కారాలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంకేముంది.. వర్షాల కోసం రైతులు ఎలా ఆకాశాన్ని చూస్తూ గడుపుతున్నారో.. తాగునీటి కోసం ఇక చెన్నై వాసులు కూడా ఆకాశాన్ని చూస్తూ గడపడం చేస్తున్నారు.