ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు - ఢిల్లీ వాసిలో గుర్తింపు

monkeypox
భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన 31 యేళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. పైగా ఈ ఢిల్లీ వాసి ఎలాంటి విదేశీ పర్యటనలు చేయకపోయినప్పటికీ ఈ వైరస్ సోకడం గమనార్హం. 
 
ఈ వ్యక్తికి జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. గతంలో దేశంలో మంకీపాక్స్‌ బారినపడిన ముగ్గురూ కేరళకు చెందినవారే. వీరు పశ్చిమాసియా దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.
 
మంకీపాక్స్ అత్యయిక పరిస్థితి 
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు శరవేగంగా వ్యాపిస్తున్నయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమై, ఆరోగ్య అత్యయిక పరిస్థితిని వెల్లడించింది. ఈ వైరస్ ఇప్పటికే 70కి పైగా దేశాలకు వ్యాపించింది. ఈ దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యయిక పరిస్థితిని విధించింది. 
 
ఈ తరహా ఆరోగ్య ఎమర్జెన్సీని విధంచడం ద్వారా గణనీయ స్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్‌కు జన్మస్థానంగా భావిస్తున్నారు. 
 
స్వలింగ సంపర్కుల్లో ఈ వైరస్ అత్యంత ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కాగా, ఇప్పటివరకు 70కి పైగా దేశాల్లో దాదాపు 61 వేల మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. జూన్ చివరి నుంచి జులై తొలివారం వరకు ఈ వైరస్ వ్యాప్తి ఏకంగా 75 శాతానికిపైగా పెరిగడం గమనార్హం.