1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (11:58 IST)

గతిలేక తెదేపాలో చేరా, చంద్రబాబు మొండిగా వెళ్లి మూల్యం చెల్లించుకున్నారు: జేసీ

జేసీ దివాకర్ రెడ్డి. లోపల ఒకటి బయట ఇంకొకటి మాట్లాడే వ్యక్తి కాదు. ఏదయినా అనుకుంటే వున్నది వున్నట్లు ముఖం మీదే మాట్లాడేస్తుంటారు. తాజాగా జేసీ చేసిన కామెంట్లు తెదేపాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.... రాష్ట్ర విభజన తర్వాత ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఆలోచన చేసి చివరిగి గతి లేక తెదేపాలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ - చంద్రబాబులు గురించి ఆలోచించినప్పుడు బాబు విజన్ వున్న వ్యక్తి అని తనకు అనిపించిందనీ, అందువల్ల పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు.
 
పంచాయతీ ఎన్నికలను బహిష్కరిద్దామని చంద్రబాబు నాయుడుతో తను సూచన చేసాననీ, అయినా దాన్ని ఆయన పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లారన్నారు. అందుకే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైసిపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు పెట్టినా గెలిచేది వైసిపియేనని వెల్లడించారు.
 
ఇక ఏపీలో భాజపా బట్టకట్టి ముందుకు సాగాలంటే... తెలుగుదేశం పార్టీతో భాజపా పొత్తు పెట్టుకోవాల్సిందేనన్నారు. అలా కాని పక్షంలో భాజపా ఎప్పటికీ బలపడలేదంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరు సోదరులు ఒకేసారి వైసిపిలోకి జంప్ చేస్తారేమోనన్న ఊహాగానాలు తిరుగుతున్నాయి.