1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. TDP Chief Chandrababu Naidu fire on CM YS Jagan Mohan Reddy

#YSJaganFailedCM రావణకాష్టంగా మారిన రాష్ట్రం : చంద్రబాబు

Chandrababu Naidu
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారంటూ ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రం రావణకాష్టంగా మారిందన్నారు. గతంలో ఎన్నడూ ఇంత ఫాసిస్టు పాలనను చూడలేదన్నారు. 
 
టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఉండవల్లిలోని ఇంటి నుంచి చంద్రబాబును అడుగు బయటకు పెట్టనీయలేదు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలోనే మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తాము శాంతియుతంగా తలపెట్టామని... అయితే, గృహనిర్బంధాలతో తనను, టీడీపీ నేతలను అడ్డుకోవడం పిరికి చర్య అని అన్నారు. 
 
పునరావస బాధితులకు ఆహారం కూడా అందకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. "ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఫాసిస్ట్ పాలనను తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టం అయిందని విమర్శించారు. ప్రభుత్వ బెదిరింపులను తలొగ్గేది లేదని... టీడీపీ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. పునరావస శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు". 
 
అంతకు ముందు తన నివాస ప్రాంగణంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని, పౌర హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. పోలీసులు అనుమతిచ్చినప్పుడు ఆత్మకూరుకు వెళ్తానని చెప్పారు. బాధితులను న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో అనేక దారుణ ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 
 
తర్వాతి కథనం
గర్భందాల్చిన ప్రేయసిని చంపేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు