శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (17:08 IST)

చైనా పెద్దల ఆదేశాలతోనే భారత సైన్యంపై దాడి : అమెరికా నిఘా వర్గాలు

ఈ నెల 15వ తేదీన లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా బలగాలు విచక్షణారహితంగా దాడి చేసి 20 మంది సైనికులను హతమార్చాయి. ఈ దాడి చైనా ఆర్మీ పెద్దల ఆదేశాల మేరకు జరిగినట్టు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. ముఖ్యంగా చైనా పీపుల్స్ ఆర్మీలో సుధీర్ఘకాలంగా పని చేస్తున్న సీనియర్ జనరల్ స్థాయి ఆదేశాల మేరకే దాడి జరిగిందనీ, ఈ విషయం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు కూడా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 
 
అమెరికా నిఘా వర్గాల మదింపుతో అత్యంత సమీప సంబంధంగల వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, వెస్టర్న్ థియేటర్ కమాండ్, అధిపతి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న జనరల్ ఝావో జోంగ్‌కి భారత దళాలపై దాడి చేయాలని చైనా సైనికులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
ఉత్తర భారత దేశం, నైరుతి చైనా మధ్య సరిహద్దుల్లో దాడి చేయాలని ఝావో ఆదేశించారని, భారత దేశానికి గుణపాఠం చెప్పేందుకు గాల్వన్ లోయలో దాడి ఉపయోగపడుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. భారత దేశంతో సహా, అమెరికా, దాని మిత్ర దేశాల దోపిడీని నివారించేందుకు, చైనా బలహీనంగా కనిపించకూడదని ఆయన అంతకు ముందు అన్నారు. 
 
జూన్ 15న జరిగిన దాడిలో చైనా సైనికులు 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడి అంతకు ముందు జరిగిన తీరులో లేదు. పరిస్థితి అదుపు తప్పినందువల్ల అప్పటికప్పుడు జరిగిన దాడిలా కనిపించడం లేదు. చైనా తన బలాన్ని చాటుకునేందుకు, తన బలాన్ని భారత దేశానికి చూపించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేసినట్లు కనిపిస్తోంది. 
 
అయితే ఈ దాడితో చైనాకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దాడి వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం లేకపోగా, భారీ నష్టాన్నే మిగల్చనుంది. ఇందులోభాగంగా చైనా కంపెనీలతో కుదుర్చుకున్న అనేక ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా రద్దు అవతున్నాయి. 
 
మరోవైపు, జూన్ 15-16 మధ్య రాత్రి భారత సైనికులపై చైనా సైనికులు దాడికి పాల్పడటం ఆసియాలోని అతి పెద్ద దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని శాంతియుతంగా చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్న విషయం తెల్సిందే.