శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (11:30 IST)

చైనా వస్తువులపై నిషేధం.. జాబితా తయారు చేస్తున్న కేద్రం??

లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా సైనికులు హద్దుమీరి భారత బలగాలపై దాడి చేసి 20 మందిని హతమార్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. 
 
చైనా బలగాలు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ కుమార్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన కారణంగా భారతీయుల్లో చైనా అంటే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఆ ప్రభావం కాస్తా చైనా తయారీ వస్తువులపై పడింది. దాంతో ప్రజలే స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రచారం చేస్తున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ వంటి వాణిజ్య విభాగాలతో చర్చలు జరిపిన కేంద్రం నిషేధ వస్తువుల జాబితాను వాటితో పంచుకుంది. ఆ జాబితాలో పెయింట్లు, వార్నిష్‌లు, ప్రింటింగ్ ఇంక్, మేకప్ సామగ్రి, హెయిర్ జెల్స్, వీడియో గేమ్ కన్సోల్స్, క్రీడా పరికరాలు, సిగరెట్లు, గాజు పలకలు, రియర్ వ్యూ మిర్రర్లు, వాచీలు ఉన్నాయి.
 
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆత్మ నిర్భర్ భారత్ పథకంతో పాటు, చైనా ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించే అంశంపైనా చర్చించారు. అయితే, అనేక మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి జాబితాలు రూపొందించినట్టయితే, దేశీయంగా తయారైన ఏ వస్తువులకు అయితే, చైనా వస్తువులు పోటీగా మారాయన్నది గుర్తించి, వాటిపైనే నిషేధం విధించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తంమీద చైనా వస్తువులపై నిషేధం తథ్యమని తెలుస్తోంది.