గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (12:53 IST)

ఆర్టికల్ 370 రద్దు... గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్.. దూకుడు తగదంటున్న సమితి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 అధికరణను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. పైగా, ప్రతీకార చర్యలకు దిగింది. ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. భారత్‌తో వాణజ్యాన్ని తెగదెంపులు చేసుకుంది. భారతీయ సినిమాలు పాకిస్థాన్‌లో ఆడకుండా నిషేధం విధించింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించింది. అలాగే, ఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ నియామకాన్ని విరమించుకుంది. ఇలాంటి దుందుడుకు చర్యలతో ముందుకుసాగుతున్న పాకిస్థాన్‌కు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. దూకుడు తగదంటూ వ్యాఖ్యానించింది పైగా, కాశ్మీర్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్‌లో కాశ్మీరీల పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు... ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను గురించి వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాశ్మీర్‌ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. 
 
అయితే, మోడీ చేసిన ప్రసంగంపై పాకిస్థాన్ పెదవి విరిచింది. అదేసమయంలో ప్రస్తుత అంశాలపై స్పందించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి మలీహా లోధి విజ్ఞప్తి చేశారు. దీంతో యూఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌ తరఫున ఆయన ప్రతినిధి స్టెఫానే డుజారిక్‌ మాట్లాడుతూ...'1972లో భారత్‌, పాకిస్తాన్‌ చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం గురించి ఆంటోనియో గుటెరస్‌ గుర్తుచేశారు. జమ్మూ కశ్మీర్‌పై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటామని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నాయి' అని పేర్కొన్నారు.