1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (16:04 IST)

కోల్‌కతాలో తొలి ఒమిక్రాన్ కేసు : ఏడేళ్ళ బాలుడుకి పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ దేశంలో మెల్లగా పాగా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 39కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కొత్తగా మరో కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడుకి ఈ వైరస్ సోకింది. 
 
బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన బాలుడు హైదరాబాద్ మీదుగా కోల్‌కతాకు చేరుకున్నాడు. అతనికి ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు చేయగా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. కానీ, ఈ బాలుడు తల్లిదండ్రులకు జరిపిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్ ఫలితం వచ్చింది. పాజిటివ్‌ అని తేలిన బాలుడిని ముర్షిదాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
దేశంలో 6,984 కేసులు..  
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 3,344 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
వీటితో కలుపుని దేశ వ్యాప్తంగా మొత్తం 6,984 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రవైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ సోకి గత 24 గంటల్లో 247మంది చనిపోగా, 8168 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మృతుల్లో కేరళ రాష్ట్రంలో 28 మంది ఉన్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 87562 మంది యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌‍లలో చికిత్స పొందుతున్నారు. అలాగే, కరోనా నుంచి దేశం ఇప్పటివరకు 3,41,46,931 మంది కోలుకోగా, 4,76,135 మంది చనిపోయారు. అలాగే, 1,34,61,14,483 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లను వేశారు.