మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (14:18 IST)

చండీగఢ్ - ఏపీలో వెలుగు చూసిన ఒమిక్రాన్ - దేశంలో 32కు చేరిన కేసులు...

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. 34 యేళ్ల విజయనగరం జిల్లాకు చెందిన వాసికి ఈ వైరస్ సోకింది. 
 
పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నవంబరు 22వ తేదీన ఇటలీ నుంచి వచ్చిన 20 యేళ్ళ యువకుడికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు. డిసెంబరు 1వ తేదీన అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు 
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వెలుగు చూసింది. విజయనగరం జిల్లా వాసికి ఈ వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తి వయసు 34 యేళ్లుగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో అనేక మంది పలు దేశాల నుంచి అనేక మంది రాష్ట్రానికి వచ్చారు. వీరికి కోవిడ్ టెస్టులు చేయగా, వారిలో విజయనగరం జిల్లా వాసికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు తేలింది. 
 
భారత్‌లో కొత్తగా 7,774 పాజిటివ్ కేసులు 
దేశంలో కొత్తగా మరో 7,774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
 
ఈ బులిటెన్ మేరకు.. 24 గంటల్లో 7,774 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 8,464 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్లలో 9,2281 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 4,75,434 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3,41,22,795 మంది కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 132,93,84,230 మందికి కరోనా టీకాలు వేశారు.
 
భయపెడుతున్న ఒమిక్రాన్ - ఆంక్షల దిశగా దేశాలు  
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. దీంతో అనేక దేశాలు భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా, పలు రకాలైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎట్-రిస్క్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులపై కఠిన నిఘాను సారించారు. ఇపుడు సరికొత్త ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
నిజానికి ప్రపంచంలో మారణహోమాన్ని సృష్టించిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయింది. ప్రాణహానితో పాటు ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేసింది. 
 
ఇపుడు ఒమిక్రాన్ వైరస్ భయపెడుతుండటంతో మరోమారు ఆంక్షలు విధించేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా, ప్రతి ఒక్కరికీ మాస్కులు తప్పనిసరి చేయాలని యోచిస్తుంది. అయితే కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
మరోవైపు, బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది. కానీ, ఈ ఆంక్షలను అధికారులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ ప్రాంతాల్లో కూడా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
 
ఇకపోతే సౌత్ కొరియాలో 7 వేకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 7 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయి.