శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శనివారం, 17 అక్టోబరు 2020 (20:06 IST)

ఎమ్మెల్యే రోజానా మజాకా, పంతం నెగ్గించుకున్నారుగా

కరోనా సమయంలో ప్రభుత్వం నిధులు, మాస్క్‌లు, పిపిఇ కిట్లు అందించకపోయినా, ఎమ్మెల్యే రోజా సహాయం చేయకుండా ఉంటే నగరి నియోజక వర్గ ప్రజల పరిస్థితి మరోలా ఉండేదంటూ నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు అప్పట్టో పెద్ద సంచలనమే రేపాయి. తెలుగుదేశం నేతలు వెంకట్రామిరెడ్డి వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
 
ప్రభుత్వం చేతగానితనానికి ఈ వీడియో ఉదాహరణ అంటూ నారా లోకేష్ కూడా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యల్లో భాగంగా వెంకట్రామిరెడ్డిని కడప మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇప్పుడు నాలుగు నెలలు తిరగకుండానే మళ్ళీ ఆ అధికారి అదే స్థానానికి రావడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపీక్‌గా మారింది.
 
రోజాపై అభిమానంతో నోరుజారీ సస్పెండ్ అయిన సదరు అధికారిని తిరిగి పూత్తూరు కమీషనర్ నియమించడం వెనుక ఎమ్మెల్యే రోజా చక్రం తిప్పారు. వెంకట్రామిరెడ్డి మాటలు అమెకు అప్పట్లో ఇబ్బందికరంగా మారినా రోజాకు మంచి మైలేజ్ తీసుకువచ్చాయి. అందుకే రోజా పట్టుబట్టి మరీ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి పోస్టింగ్ ఇప్పించారు. అభివృద్ధి పనులకు సహకరిస్తూ తనపై ప్రశంసలు కురిపించిన అధికారిని వదులుకోవడం ఎమ్మెల్యే రోజాకు ఇష్టం లేక వెంకట్రామిరెడ్డికి పోస్టింగ్ ఇప్పించారు. ఈ అంశాన్ని జిల్లా నేతలు వ్యతిరేకించినా రోజా తన పంతం నెగ్గాలని పోస్టింగ్ వేయించుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి.