ఏపీలో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేయనుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అక్టోబరు 3న ఓటర్ల తుది జాబితాను వెల్లడించనుంది.
రాష్ట్రంలో 'సర్' గడువు పొడిగించాలని కోరుతూ ఈసీఐకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సోమవారం లేఖ రాశారు. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరారు. వివిధ రాజకీయ పక్షాలు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను లేఖకు జతపరిచారు.
ఈసీ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు మంగళవారంతో ముగియాల్సి ఉండగా.. కొన్ని నియోజకవర్గాల్లో 5 నుంచి 10 శాతం మేర డిజిటైజేషన్ పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రత్యేక అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్యాదవ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గడువు పొడిగించినట్లు తెలుస్తోంది.
