బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (19:42 IST)

బంగాళాఖాతంలో వాయుగుండం.. 23 వరకు వర్షాలు

low pressure
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా ఈ నెల 23వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది నైరుతి, ఆగ్నేయ. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవుందని, వచ్చే 24 గంటల్లో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది.  
 
ఈ వాయుగుండం ప్రభావం కారణంగా దక్షిమ కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షపు జల్లలు ప్రారంభమైనట్టు తెలిపింది. ముఖ్యంగా, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. రాగల 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటన జారీచేసింది 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని తెలిపింది. సోమవారం సాయంత్రానికి ఇది మరింతగా బలపడుతుందని, అయితే, ఇది దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు దిశగా పయనించే కొద్దీ వాతావరణంలో మార్పులు  చోటుచేసుకుంటాయని తెలిపింది. 
 
మరోవైపు, నేడు, రేపు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో ఉత్తరాంధ్రతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈ నెల 23వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.