శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (15:26 IST)

మాస్క్ పెట్టుకోమంటూ మదలింపు.. మాటామాటా పెరిగి కార్పొరేటర్‌పై దాడి..

దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు చెపుతూనే ఉన్నాయి. కానీ, ఎంతో మంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, మాస్కులను ధరించకుండా తమ వంతుగా కరోనా విస్తరణకు కారకులవుతున్నారు. తాజాగా గుంటూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఓ కార్పొరేటర్‌పై ఒక యువకుడు, అతని స్నేహితులు కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఆ కార్పొరేటర్ అనుచరులు వచ్చిన ఆ యువకుడిని చితకబాదారు. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు నగరంలో 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారి ఉదయం బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడీపేట నాలుగో లైన్‌లోని సాయిచరణ్‌ బాయ్స్‌ హాస్టల్‌ వద్ద యువకులు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లిన కార్పొరేటర్‌ మాస్కు ధరించని యువకుడిని గట్టిగా మందలించారు. 
 
ఈ విషయంలో మాటామాటా పెరిగి ఓ యువకుడిపై కార్పొరేటర్‌ చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు ‘మా తల్లిదండ్రులే నన్ను కొట్టరు.. మీరు కొడతారా?’ అంటూ కార్పొరేటర్‌పై తిరగబడ్డాడు. తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారిని తిరిగి కొట్టాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ అనుచరులు అక్కడికి చేరుకుని వసతి గృహంలోని యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 
 
విషయం తెలుసుకున్న నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కార్పొరేటర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 
 
కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులు లేకుండా తిరగటం ప్రమాదకరమని చెబితే ఇలా దాడి చేయడమేంటని కార్పొరేటర్‌ ప్రశ్నించారు. బ్రాడీపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.