సొంత పార్టీ నేతలనే పట్టించుకోని వైఎస్ జగన్.. అప్పుడైతే ఓకే.. ఇప్పుడేమైంది?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సొంత పార్టీ నాయకులు అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా, బెంగళూరు నుంచి విమానంలో వచ్చినప్పుడు జగన్ను పలకరించడానికి గన్నవరం వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివస్తుంటారు. కానీ వారి కోసం జగన్ ఏమాత్రం సమయం కేటాయించరు.
జగన్ రెండు వారాలకు ఒకసారి కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తుండటంతో, ఏ స్థాయి నాయకుడైనా అక్కడ ఆయనను కలవడం దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే, కనీసం విమానాశ్రయంలోనైనా ఆయన్ని కలవడానికి నాయకులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.
కానీ అక్కడ కూడా జగన్ వారికి సమయం కేటాయించడం లేదు. ఆయన తన అధికారిక కార్యక్రమాల కోసం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి వెంటనే కారులో వెళ్లిపోతుంటారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నాయకులకు అందుబాటులో ఉండకపోవడం జగన్ అలవాటుగా ఉండేది. అప్పట్లో ఆయన అధికారిక బాధ్యతల దృష్ట్యా అది కొంతవరకు అర్థం చేసుకోదగినదే. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ అదే పంథాను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
