నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదల్లో వందలమంది గల్లంతయ్యారు. చాలామంది ఆచూకి ఇప్పటివరకూ లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఆచూకి ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడకు చెందిన ముగ్గురు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరి ఆచూకి తెలియాల్సి వుందన్నారు. ఐతే కర్నూలు నుంచి మానససరోవర్ యాత్రకు వెళ్లిన వారంతా సురక్షితంగా వున్నారనీ, వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా పలువురు పర్యాటకులు వెళ్లినట్లు సమాచారం. ఐతే వీరి సంఖ్య ఎంత అన్నది తెలియాల్సి వుంది.
కన్నీటి పర్యంతమైన సద్గురు, మిన్నంటిన రోదనలు
కైలాష్ మానస సరోవర యాత్ర కోసం సద్గురు జగ్గీ వాసుదేవ్తో పాటు వచ్చిన యాత్రికుల్లో 80 మంది ఆచూకి లేదని, వారు గల్లంతై వుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సద్గురు యాత్రికులతో మాట్లాడుతూ... ఈ సమాచారం చెప్పడానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఓ భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. నేపాల్ ప్రాంతంలో 480 మందికి పైగా మిస్ అయ్యారు. మనవారి ఆచూకి కోసం వెళ్లేందుకు ప్రయత్నం చేసాము. రోడ్లు బ్లాక్ చేసారు. టెలికమ్యూనికేషన్ డౌన్. మా బృందంలో ఒక బృందం... అంటూ గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు సద్గురు.
3 గ్రూపులు మిస్ అయ్యాయి. వారిలో 22 మంది అమెరికాకు చెందినవారు. 12 మంది కెనడా, 11 ఆస్ట్రేలియా, 9 ఇంగ్లాండ్, 4 జర్మనీ, 3 ప్రాన్స్... ప్రపంచంలోని పలు దేశాల నుంచి మొత్తం 80 మంది ఆచూకి గల్లంతైంది. వీరిలో 34 మంది పురుషులు కాగా 46 మంది మహిళలు వున్నారు. ఇమ్మిగ్రేషన్ కోసం వారం క్రితం వరద సంభవించిన ప్రాంతానికి మేము కూడా వెళ్లాము. ఇప్పుడది వరదల్లో కొట్టుకుపోయింది అంటూ కన్నీటిపర్యంతమయ్యారు సద్గురు.
