1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (13:01 IST)

స్వల్ప అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్

pawan kalyan
సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసంతో పవన్‌ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన భేటీని వాయిదా వేశారు. ఈ సమావేశం మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కానుంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్‌ సమక్షంలో నేడు జనసేనలో చేరనున్నారు. 
 
చరిత్ర సృష్టిచిన జనసేన యూట్యూబ్ చానెల్ 
 
సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ చానెల్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ చానెల్‌‍ను ఇష్టపడుతూ, సబ్ స్క్రైమబ్ చేసిన వారి సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. పది లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేరుకున్న జనసేన అధికారిక యూట్యూబ్ చానెల్ అని ట్విట్టర్‌లో తెలిపింది. 
 
ఈ సందర్భంగా పార్టీకి మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది. మరోవైపు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మంగళవారం భీమవరంలో కొనసాగనుంది. ఇందులోభాగంగా, ఆయన ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించి, వారికి మార్గనిర్దేశం చేయనున్నారు.
 
కాగా, నరసాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మరోమారు వైకాపా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ హోదాలో బటన్ నొక్కని జాబితాను చదివి వినిపించారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్, రానీ ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్, నష్టపోయిన రైతు పరిహారం బటన్, ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు బటన్, దగ్ధగ్డమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్, పూర్తి కానీ బ్రిడ్జి బటన్, దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్, ఆక్వా రైతుకు రూ.1.5కు యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్, కోనసీమ రాని రైలు బటన్ ఇలా గత ఎన్నికల్లో ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చని హామీలను చదివి వినిపించారు. 
 
గన్ లైసెన్స్ కావాలంటూ ఏపీ మంత్రి దరఖాస్తు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వంపై సీఎం జగన్ మంత్రివర్గంలో పని చేసే మంత్రులకు తమ వ్యక్తిగత రక్షణపై నమ్మకం లేకుండా పోయింది. దీంతో తమకు గన్ లైసెన్స్ కావాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. సాక్షాత్తూ విశాఖపట్టణం వైకాపా ఎంపీ కుటుంబ సభ్యులే ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యారు. వీరంతా ఏకంగా 48 గంటల పాటు కిడ్నాపర్ల చెరలో ప్రాణభీతితో  బిక్కుబిక్కుమంటూ గడిపారు. 
 
వైకాపా ప్రభుత్వ పాలనపై వైకాపా ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండాపోతే ఇక సాధారణ పౌరులకు దిక్కెవరంటూ చర్చ సాగుతోంది. పైగా, ఈ కిడ్నాప్ అంశం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో పలువురు వైకాపా నేతలు తమ వ్యక్తిగత రక్షణ కోసం తుపాకీలు కావాలంటూ దరఖాస్తులు చేసుకునేందుకు క్యూకడుతున్నారు. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీకి, ఆయన కుమారుడు శరత్ చౌదరికి ఏకంగా పోలీసులే సూచించారు. దీంతో వారిద్దరూ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
మరోవైపు, ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కూడా తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు వైకాపా నేతలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖలో 600 మందికి గన్‌‍లైసెన్స్ ఉంది. వీరిలో 400 మంది వరకు మాజీ సైనికోద్యోగులు. వీరిలో ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మరో 200 మంది వరకు రాజకీయ, వ్యాపార ప్రముఖులకు లైసెన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
కొండలు - గుట్టలకు గుండు కొట్టేస్తున్నారు.. ఎక్కడ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు చెందిన మట్టి మాఫియా రెచ్చిపోతోందని రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. ఈ అరాచకం అటు విశాఖ నుంచి ఇటు అనంతపురం వరకు సాగుతోందని, ఈ క్రమంలో వారి కంటికి కనిపించే ఏ కొండనూ వైకాపా నాయకులు వదలిపెట్టడం లేదంటున్నారు. 
 
దీనికి తాజా ఉదాహరణే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోవడమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వడంతో కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి పరిధిలోని గుట్టను తవ్వి ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారు. 
 
స్థానిక వైకాపా నాయకుడొకరు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి రోజూ వందలాది టిప్పర్లతో ప్రైవేట్‌ లేఅవుట్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొద్దిరోజులకే గుట్ట కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఆ నాయకుడు ఇంతటితో ఆగలేదు.. మట్టి తరలించగా చదునైన ప్రాంతంలో మామిడి చెట్లు పెంచినట్లు రికార్డులో చూపి ఉపాధి నిధులు కాజేశారు.