1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:12 IST)

ఏపీలో రాష్ట్రపతి పాలన ఖాయం: దివ్యవాణి

రాజధానికోసం రైతులు చేసిన త్యాగాలను రోడ్డెక్కించేలా మూడురాజధానులనే మూర్ఖపు నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి భావితరాల భవిష్యత్ ను అంధకారం చేశాడని, ఆయన అరాచకపు పాలనకు నిదర్శనంగా అమరావతి మౌనంగా నిలిచి రోదిస్తోందని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి స్పష్టంచేశారు. ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా ...!

రాష్ట్రంకోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను రోడ్లెక్కించి, వారికి బేడీలు వేసిన పాలనను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం.  ప్రపంచంలోని అనేక గొప్పనగరాలకు ధీటుగా గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టింది. చంద్రన్న పాలనలో ఆకాశాన్నంటే భవనాలు అక్కడ భూమిని చీల్చుకొని మొలిచాయి.  సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానికి మణిహారాల్లా నిలిచాయి. అటువంటి నగరం ప్రభుత్వం మారగానే మౌనంగా రోదిస్తోంది.

మూర్ఖపు పాలనలో మూడు రాజధానుల నిర్ణయంతో భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.  పాలకుల తెలివితక్కువ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాయపూడి రోడ్డెక్కితే, తుళ్లూరు తుళ్లిపడింది. బోరుపాలెం బోరున విలపిస్తుంటే, అనంతవరం ఆగ్రహిస్తే, ఉద్ధండరాయుని పాలెం ఉడుకెత్తుతోంది.  ఒక్క అవకాశమంటూ బతిమాలిన రాక్షసపాలనకు, రైతులకు మధ్య 315 రోజులుగా పోరాటం సాగుతోంది.

దళితులు, బీసీలు, మైనారిటీలందరి కలల రూపంగా నిలిచిన బహుజనవర్గాల రాజధానికి కమ్మసామ్రాజ్యం అని పేరు పెట్టారు. శ్మశానమని, ఎడారని, ముంపుప్రాంతమని దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడానికే పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు.  మాటతప్పని మడమతిప్పని సీఎం ఎవరికాళ్లపై పడ్డారో ప్రపంచమంతా గమనిస్తోంది. 

వరదల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం చేతగానివారు, సిగ్గులేకుండా రాళ్లపై ఫొటోలు వేయించుకుంటున్నారు.  సొంత రాష్ట్రంలో ప్రజలు వరదల్లో ఉంటే, పక్కరాష్ట్రానికి బోట్లు పంపించే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. పక్కరాష్ట్రానికి సాయం చేయడాన్ని తాము తప్పుపట్టడంలేదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో పడనట్లు నటిస్తూనే, ముసుగులో వ్యవహారాలెందుకు?

వరదలతో సర్వంకోల్పోయిన వారిని ఆదుకోమంటే, మంత్రులెందుకు విషనాగుల్లా బుసలు కొడుతున్నారు? లోకేశ్ ప్రజల్లోకి వెళితే, ఆయనపై కేసులు పెట్టడమేంటి? రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే వ్యక్తికి, ఆప్రాంతంలోని రైతుల కష్టాలు పట్టవా? 17నెలల వైసీపీపాలనలో రైతులకు ఇచ్చిన పరిహారం కేవలం రూ.25లక్షలు.  ప్రజలకు రాజధాని విలువ తెలియాలని రాజధానిని ఆపేశారు.

అన్నం విలువ తెలియాలని అన్నక్యాంటీన్లు మూసేశారు. ప్రాణం విలువతెలియాలనే ఫైన్లు వేస్తున్నామంటున్నారు. ప్రజల ఓటు విలువ తెలియాలంటే, ముఖ్యమంత్రి తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.  సంపద సృష్టించడం తెలియని వారు, అభివృద్ధి-సంక్షేమం చేతగానివారు ప్రజలపై ధరలభారం, పన్నుల మోత మోపారు.  పెట్రోల్ డీజిల్ పై రూ.500కోట్ల భారం వేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ.1000కోట్లవరకు ప్రజలనుంచి వసూలుచేస్తున్నారు. 

ట్రాక్టర్ ఇసుకను రూ.10వేలకు అమ్ముతూ దండుకుంటన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.1500కోట్ల భారం మోపారు. నిత్యావసరాలపై 10 నుంచి 30శాతం ధరలు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వానిదే.  పేదల పొట్ట కొడుతూ, పాలకులు తమ కడుపులు నింపుకోవడాన్నిఇప్పుడే చూస్తున్నాం.  రాష్ట్రానికి ఎన్నిసమస్యలున్నా, చంద్రబాబు ఏనాడూప్రజలపై  వీసమెత్తు భారం వేయలేదు.

వరద బురదలో పడిపోయే ట్రాక్టర్ ని ఆపిన సత్తా ఉన్న నాయకుడు లోకేశ్, అదేవిధంగా వైసీపీప్రభుత్వం పడుకోబెట్టిన రాజధానిని తిరిగి ప్రపంచం మెచ్చేలా నిలుచోబెట్టే సమర్థుడు కూడా ఆయనే. డీజీపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి, ప్రతిపక్షాలపై, రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.  అన్నం తినేవాడికే రైతు విలువ తెలుస్తుంది.

రైతుల మౌనం, వారి ఓర్పుని పాలకులు చేతగానితనంగా భావిస్తున్నారు. శిరోముండనం బాధితుడి మాదిరే, అమరావతి రైతులు తాము కూడా నక్సలైట్లలో చేరతామని రాష్ట్రపతికి లేఖలు రాస్తే, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని పాలకులు గ్రహిస్తే మంచిది.