శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (08:44 IST)

రాజధాని రైతులకు బేడీలు... పోలీసుల చర్యలపై సర్వత్రా విమర్శలు

రాజధాని రైతులను బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తరలించారు. పోలీసుల చర్య పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు ఈ నెల 22న పలు ఆందోళనలు చేయడం, మూడు రాజధానులకు మద్ధతుగా తమకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ మరికొంతమంది నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులపై పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

తరువాత జరిగిన చర్చల్లో రవి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని చెప్పినా పోలీసులు నిరాకరించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత కేసు వెనక్కి తీసుకోవడం కుదరదని, కోర్టులో తేల్చుకోవాలని డిఎస్‌పి దుర్గాప్రసాద్‌ తేల్చి చెప్పారు. కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ఈ నెల 26న హాజరు పర్చారు.

రైతులకు కోర్టు రిమాండ్‌ విధించింది. కరోనా పరీక్షల అనంతరం పోలీసులు వారిని అదే రోజు నర్సారావుపేట సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం వారిని నర్సరావుపేట కోర్టు నుంచి గుంటూరు జిల్లా జైలుకు ఆర్‌టిసి బస్సులో తరలించే సమయంలో బేడీలు వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
 
అన్నదాతకు బేడీలా?: చంద్రబాబు నాయుడు
కృష్ణాయపాళెం దళిత, బిసి, తదితర రైతులపై ఎస్సీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదని పిర్యాదుదారుడైన ఈపూరు రవి పోలీసులను కోరారు. తాను పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోమని పోలీసులకు విజ్ఞప్తి  చేశారు.

అయినా పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది. రైతు విద్రోహ చర్య అవుతుంది.

మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా పోలీసు చర్య ఉన్నది. ముఖ్యమంత్రి ఈ మానవహక్కుల ఉల్లంఘనకు బాధ్యత వహించాలి.