గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:22 IST)

72వ రోజుకి రాజధాని రైతుల ఆందోళనలు

రాజధాని రైతుల ఆందోళనలు 72వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 72వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
నల్లబెలూన్లతో రైతుల నిరసన
తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఆందోళన నిర్వహించారు. ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

నల్లబెలూన్లతో రాజధాని రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.
 
 
రాజధాని 13 జిల్లాలకు చెందిన సమస్య: సీపీఎం
అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదు, 13 జిల్లాలకు చెందిన సమస్య అని సీపీఎం నేత బాబూరావు అన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో మహిళలు చేపట్టిన 24 గంటల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.

ప్రతిపక్ష నేతగా అమరావతికి జగన్‌ ఒప్పుకున్నారన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చిందన్నారు. సీఎం మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడకుండా రాజధాని మార్పుపై నిర్ణయం ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు.